పెట్రోల్ బంకు యజమానులకు ఆత్మ కమిటీ హెచ్చరిక
నేటిసూర్య ప్రతినిధి : వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన డీజిల్ అందుబాటులో ఉండేలా పెట్రోల్ బంకు యజమానులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భద్రాచలం నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ ఇందుల గోపాల బుచ్చిబాబు సూచించారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ప్రస్తుతం రైతులు పొలాల దుక్కులు, నేల దున్నే పనులు, సాగు ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రతి రైతుకు కనీసం 50 లీటర్ల వరకు డీజిల్ అవసరమవుతుందని, అయితే కొంతకాలంగా పెట్రోల్ బంకులకు డీజిల్ ట్యాంకర్లు వచ్చిన కొద్ది గంటల్లోనే నిల్వలు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి వచ్చే భారీ వాహనాలు పెద్ద మొత్తంలో డీజిల్ తీసుకెళ్లడం వల్ల స్థానిక రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
వ్యవసాయ పనులకు డీజిల్ అత్యంత కీలకమని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బంకు యజమానులు తగిన నిల్వలు ఉంచాలని, రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వ్యవసాయ సీజన్లో రైతులకు డీజిల్ అందకుండా ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నియంత్రణ విధానం అమలు చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయ పనుల నిరంతర కొనసాగింపే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, చర్ల మరియు దుమ్ముగూడెం ప్రాంతాల్లోని పెట్రోల్ బంకు యజమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించి రైతులకు అవసరమైన డీజిల్ సరఫరా చేయాలని ఆత్మ కమిటీ చైర్మన్ ఇందుల గోపాల బుచ్చిబాబు విజ్ఞప్తి చేశారు.










