గోవుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలి.
చర్ల తహసీల్దార్కు హిందూ సంఘాల వినతిపత్రం
నేటి సూర్య ప్రతినిధి: భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరియు చర్ల మండల పరిసర ప్రాంతాల్లో గోవులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను నిరసిస్తూ సోమవారం వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో చర్ల తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర గో సంరక్షణ ప్రవాహరి హేమంత్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చర్ల విశ్వహిందూ పరిషత్, వనవాసి సంస్థలు, ధర్మజాగరణ సమితి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలు మరియు హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవమైన గోమాతను రక్షించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గోవులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అక్రమ రవాణా, వధకు తరలింపులు వంటి అంశాలు హిందూ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గోమాత భారతీయ సంస్కృతి, సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందని, గోవుల సంరక్షణకు ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
గోవుల రక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు అక్రమ రవాణా మరియు హింసాత్మక చర్యలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు “జై గోమాత – జై జై గోమాత” నినాదాలతో గోవుల సంరక్షణకు తమ మద్దతును తెలియజేశారు. గోమాత పరిరక్షణ కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.










