డ్రైనేజీల శుభ్రత, చెత్త తొలగింపుతో పరిశుభ్రమైన వాతావరణం లక్ష్యం
నేటి సూర్య ప్రతినిధి: చర్ల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామపంచాయతీ సర్పంచ్ సామ్రాజ్యం, సెక్రటరీ బి. రాంబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామంలో ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా డ్రైనేజీలను శుభ్రపరచడంతో పాటు రహదారుల ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు చేపట్టారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు, చెత్త కారణంగా నీరు నిల్వ ఉండి దోమలు, వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పంచాయితీ ఈవో రాంబాబు తెలిపారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలు, రహదారుల వెంట పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులతో తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ సందర్భంగా సెక్రటరీ బి. రాంబాబు మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్ల నుంచి వచ్చే చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో వేయకుండా గ్రామపంచాయతీ సూచనలను పాటించాలని కోరారు. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేందుకు పంచాయతీ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
స్థానిక ప్రజలు గ్రామపంచాయతీ అధికారులు చేపట్టిన ఈ చర్యలను అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలను తరచూ నిర్వహించాలని కోరారు. పారిశుద్ధ్య పనులతో గ్రామంలో పరిశుభ్రత మెరుగుపడి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.










