రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలి : నాయకుల పిలుపు
నేటి సూర్య ప్రతినిధి: బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చర్ల మండలంలోని సింగసముద్రం గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి ముఖ్య నాయకుల సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. భద్రాచలం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, చర్ల మండల ఇన్చార్జ్ చెన్నం మోహన్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు సిద్దార్థ పూలే, నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పుల నారాయణ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా చర్ల మండల కమిటీని అధికారికంగా ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా పాయల మోహన్రావును నియమించగా, ఉపాధ్యక్షుడిగా ధ్రువ నర్సింహారావు, ప్రధాన కార్యదర్శిగా చాపా భాస్కర్రావు, కార్యదర్శిగా కాకా నర్సయ్య, కోశాధికారిగా పర్సిక చిన్నబ్బిలను నియమించినట్లు నాయకులు వెల్లడించారు. నూతన కమిటీ సభ్యులకు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేసి, మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
జిల్లా ఉపాధ్యక్షుడు సిద్దార్థ పూలే మాట్లాడుతూ చర్ల మండలంలోని ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో సెక్టార్ కమిటీలు, పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని గ్రామస్థాయిలో విస్తరించాలని సూచించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పుల నారాయణ మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ సామాజిక న్యాయం కోసం పనిచేసే పార్టీ అని, అణగారిన వర్గాల అభ్యున్నతే పార్టీ లక్ష్యమని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తడికల శివకుమార్, బొగ్గుల శ్రీరాములు, సోయం శ్రీమూర్తులు తదితరులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ఐక్యంగా పనిచేస్తూ చర్ల మండలంలో బీఎస్పీని మరింత బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.











