భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం, లక్ష్మీ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని జాంబవంతుడి గుట్టలపై వెలసిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంగళవారం భక్తి శ్రద్ధల మధ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది .ఈ సందర్భంగా చిన్న ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ విజయ కనకదుర్గ సేవ కమిటీ సభ్యులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు మరియు వడి బియ్యాన్ని సమర్పించారు.
శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయబద్ధంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు అర్పించారు. అనంతరం వడి బియ్యాన్ని సమర్పించి అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు, వడి బియ్యం సమర్పించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో చిన్న ఇంద్రకీలాద్రి సేవ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, స్థానిక భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రాకపోకలతో ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో కళకళలాడింది.










