వొకేషనల్ గ్రూపులను చిన్న చూపు చూస్తున్న ప్రిన్సిపాల్.
చులకన భావంగల అతన్ని సస్పెండ్ చేయాలి.
బీఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు కొట్టే నవీన్
చర్ల, నేటిసూర్య న్యూస్: తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఉంది ఇక్కడి ప్రిన్సిపాల్ బాగోతం… అదే కాలేజీలో బాధ్యతలు నిర్వర్తిస్తూ అక్కడి జీతంతోనే సర్వయివ్ అవుతూ ఇలాంటి చెత్త కామెంట్లు చేయడం ఎంత వరకు సమంజసమని బీఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు కొట్టే నవీన్ ఏకి పారేశారు. వొకేషనల్ గ్రూపులతో పాటు ఆ గ్రూపుల్లో చదివే విద్యార్థులను పనికిమాలిన వాళ్లని అవమానించిన చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు కొట్టే నవీన్ మాట్లాడుతూ కాలేజీలోని ఒక విద్యార్థినీ ఈటీ గ్రూపునకు మార్చాలని కోరగా ఆ వొకేషనల్ గ్రూపులన్నీ పనికి మాలిన గ్రూపులని, ఆ గ్రూపులో చదువుతున్న విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ కాదని, చదువు రానివారు మాత్రమే ఆ గ్రూపులో చేరతారని, బిలో యావరేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఆ గ్రూపులో ఉంటారని, ఆ గ్రూపుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అవి చెత్త గ్రూపులని కమిషనర్ కూడా మాతో అంటున్నాడన్నారు. బాధ్యత గల పోస్టులో ఉండి తన కాలేజీలో ఉన్న వొకేషనల్ కోర్సుని మంచి గ్రూపు కాదని చెప్పడం అత్యంత దుర్మార్గమన్నారు. విద్యార్థులను అదేవిధంగా ఆ గ్రూపునకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులను కూడా ఘోరంగా అవమానించినట్లేనని మండిపడ్డారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించాలని సంబంధిత ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులు, ఉపాధ్యాయులను అవమాన భారం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు ఎంఎల్. నారాయణ, బీఎస్ఎఫ్ఐ చర్ల మండలం నాయకులు సంతోష్ రాజేష్, ప్రతాప్ రెడ్డి, బాలు, జగదీష్, సాయి, సుజిత్, భగత్ సింగ్, ధనుష్ తేజ తదితరులు పాల్గొన్నారు.











