ముంబై దెబ్బకు బీజింగ్ బేజారు.. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

భారత ఆర్థిక రాజధాని ముంబై వరల్డ్ లెవల్‌లో సత్తా చాటింది. పొరుగు దేశం చైనా క్యాపిటల్ బీజింగ్‌ను వెనక్కు నెట్టింది. ఆర్థికంగా తనకు ఎవరూ సాటి రాలేరని మరోసారి చాటి చెప్పింది.

దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఇండియాను ఆకాశానికెత్తేస్తున్నారు.

బీజింగ్‌ను వెనక్కునెట్టి ఆసియా బిలియనీర్ క్యాపిటల్ టైటిల్‌ను ముంబై కైవసం చేసుకుంది. ఈ మేరకు తాజాగా విడుదలైన ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024’ దీన్ని ధ్రువీకరిస్తోంది. 92 మంది బిలియనీర్లతో ముంబై చరిత్రలో మొట్టమొదటిసారిగా బీజింగ్‌ను అధిగమించింది. సంపదతో పాటు శ్రేయస్సు విషయంలోనూ అభివృద్ధి కేంద్రంగా తన హోదాను పటిష్టం చేసుకుంది.

 

ఈసారి కొత్తగా నగరం 27 మంది కొత్త బిలియనీర్‌లను జోడించుకుంది. కాగా ఈ సంఖ్య బీజింగ్‌లో కేవలం 6 మాత్రమే కావడం విశేషం. బిలియనీర్ల సంఖ్య పెరుగుదల ప్రపంచ వేదికపై భారతదేశానికి పెరుగుతున్న ఆర్థిక ప్రాముఖ్యతను బలపరుస్తుంది. రెండవ అత్యధిక బిలియనీర్ చేరికలను నమోదు చేసి రికార్డు సృష్టించింది.

2024 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో టాప్ 10లో ఆసియాలోని అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ చోటు దక్కించుకున్నారు. గ్లోబల్ ఎలైట్ ల్యాండ్‌స్కేప్‌లో భారత్ కీలక ప్లేయర్‌గా ఆవిర్భవించడంలో ప్రపంచ ప్రముఖుల మధ్య అంబానీ పాత్రను ఈ జాబితా నొక్కిచెప్పింది. చైనాలో 573 మంది బిలియనీర్ల సంపద క్షీణించగా.. భారత్‌లో మాత్రం కేవలం 24 మందే తిరోగమనాన్ని చవిచూశారు. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ధిక్కరిస్తూ భారతదేశ సంపద గత ఏడాదితో పోలిస్తే 51 శాతం పెరిగింది.

గతేడాది కంటే ముంబై సంపదలో 47 శాతం పెరుగుదల నమోదైంది. ఇదే సమయంలో బీజింగ్ యొక్క 28 శాతం క్షీణతను అధిగమించింది. చైనా బిలియనీర్ల సగటు సంపద 3.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే భారత్ 3.8 బిలియన్ డాలర్లతో ముందంజలో ఉంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది అనేందుకు ఈ గణాంకాలే ఉదాహణ అని హురున్ ఇండియా వ్యవస్థాపకులు అనాస్ రెహమాన్ జునైద్ పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్