రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మంగళవారం గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువస్తే మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షణ చేయవలసి వస్తుందని వాపోయారు. రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తుందని, రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తక్షణమే ప్రభుత్వం రైతుల పండించిన పంటను కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ధర్నా చేస్తున్న బిఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.











