బానుడి ప్రతాపానికి అల్లాడుతున్న ప్రజలు.
ఉపాధి హామీ కార్మికులు జాగ్రత్తలు పాటించాలి. సోయం రాజారావు
చర్ల, నేటి సూర్య ప్రతినిధి:
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉదయం మొదలైన వేడి మధ్యాహ్నానికి తారస్థాయికి చేరడంతో బయటకు రావడానికే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కూలి పనులు చేసుకునే వారు, ఉపాధి హామీ పథకంలో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోయం రాజారావు మాట్లాడుతూ, ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనులకు వెళ్లే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఉదయం వేళల్లోనే పనులు పూర్తి చేసుకునేలా చూడాలని, మధ్యాహ్నం వేళల్లో తీవ్ర ఎండలో పని చేయకుండా ఉండాలని సూచించారు.
కూలీలు తగినంత నీరు తాగడం, తలకు గుడ్డ కట్టుకోవడం, సన్ స్ట్రోక్ నుంచి రక్షణ కల్పించే చర్యలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
అలాగే ప్రభుత్వం కూడా ఉపాధి హామీ పనుల సమయాలను మార్పులు చేసి, కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. గ్రామ స్థాయి అధికారులూ ప్రజలకు అవగాహన కల్పించాలి.
మొత్తంగా ఈ ఎండల తీవ్రతలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సోయం రాజారావు విజ్ఞప్తి చేశారు.










