చర్ల గడింకోట మైదానంలో స్థానిక యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతున్న “చర్ల టీ-10 లీగ్ క్రికెట్ టోర్నమెంట్” పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్ను భద్రాచలం నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు , చర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు వర్మ గారు సంయుక్తంగా ప్రారంభించి ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రారంభం అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వయంగా బ్యాటింగ్ చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహించారు. అదే సమయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజవర్మ బౌలింగ్ చేయడంతో అక్కడి వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు ఇలా క్రీడల్లో పాల్గొనడం యువతలో మరింత ఉత్సాహాన్ని నింపింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన జట్లు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువత క్రీడల పట్ల చూపుతున్న ఆసక్తి, ఐక్యత ఈ కార్యక్రమం ద్వారా స్పష్టంగా కనిపించిందని పలువురు అభిప్రాయపడ్డారు.
అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువతలో క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందుతాయని పేర్కొన్నారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు ఇవి తోడ్పడతాయని తెలిపారు. ప్రభుత్వం కూడా క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు వర్మ మాట్లాడుతూ, యువత క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని, ఇలాంటి టోర్నమెంట్లు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. క్రీడలతో పాటు సమాజంలో శాంతి, భద్రత కాపాడడంలో యువత ముందుండాలని సూచించారు.
అనంతరం చీమలమర్రి మురళి, కొత్తపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. యువత తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇలాంటి వేదికలు చాలా అవసరమని, క్రీడల ద్వారా ఐక్యత, క్రమశిక్షణ, స్నేహభావం పెంపొందుతాయని అన్నారు. క్రీడలు యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించాలని వారు అన్నారు.
నిర్వాహకులు యువతను ప్రోత్సహిస్తూ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.










