24 సంవత్సరాల పునరుద్ధరణ సందర్భంగా విశేష కార్యక్రమాలు – భక్తులకు ఆహ్వానం
భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికత కలయికగా నిలిచిన చర్లలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సన్నాహాలు చేపట్టింది. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ పురాతన శివాలయం చర్ల ప్రాంతానికి ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది.
ఈ ఆలయం 2002 మే 6న గ్రామస్తుల సహకారంతో పునరుద్ధరించబడింది. ఆలయ ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం నిర్వహించాల్సి ఉండగా, 2014లో చివరిసారిగా ఈ మహోత్సవం జరిగింది. ఇప్పుడు 2026 మే 6న పునరుద్ధరణకు 24 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రెండో మహా కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ మహోత్సవాలను ఆలయ ప్రధాన అర్చకులు సాయి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో పలు ఆధ్యాత్మిక విశేషాలు చోటుచేసుకోనున్నాయి.
మే 5, మంగళవారం రోజున భక్తులు సమర్పించిన కళశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రుద్రహోమం, లక్ష్మీ గణపతి హోమంతో పాటు చండీశ్వరుడు, దక్షిణామూర్తి, విఘ్నేశ్వరుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలకు ఆరాధనలు జరుగనున్నాయి.
మే 6, బుధవారం ప్రధాన కార్యక్రమమైన మహా కుంభాభిషేకం ఆలయ గోపురంపై నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బూరెలు పైకి విసరడం, వాటిని ప్రసాదంగా స్వీకరించడం వంటి సంప్రదాయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు శాంతి కళ్యాణం ఘనంగా జరుగనుంది.
మే 7న సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించనున్నారు.
చర్ల మండల దేవాలయాల చరిత్రలో 24 సంవత్సరాల పునరుద్ధరణ పూర్తి చేసుకుని రెండో మహా కుంభాభిషేకం జరుపుకుంటున్న ఈ శివాలయం కార్యక్రమం ప్రాంతానికి గర్వకారణమని ఆలయ కమిటీ పేర్కొంది. ఈ మహోత్సవాల్లో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాకుండా, మన సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పే మహోత్సవంగా నిలవనుంది.











