నేటి సూర్య ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని చిన్నా అరుణాచలం ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. భద్రాచలం నుండి పర్ణశాలకు వెళ్లే మార్గంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నరసాపురం గ్రామంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం ఆలయం వద్ద భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆలయ వ్యవస్థాపకులు శ్రీ శివ నాగరాజు స్వామి.
ఉదయం నుంచే చిన్న అరుణాచలం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని అదే మార్గంలో పర్నశాలకు బయలుదేరిన భక్తుల కు దాహార్తి తీర్చేందుకు ఆలయం వద్ద పుచ్చకాయలను కోసి అందిస్తున్నారు. మండుటెండలో ప్రయాణించే భక్తులకు ఈ చల్లని సేవ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఈ సేవను స్వీకరించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శివ నాగరాజు స్వామి సేవా భావంతో ముందుకు వచ్చి స్వయంగా పుచ్చకాయలు ముక్కలుగా కోసి భక్తులకు అందించడం విశేషం. ఆయనతో పాటు ఆలయ సిబ్బంది, గ్రామ యువత కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ సేవలు అందిస్తున్నారు. ఎండ తీవ్రతను లెక్కచేయకుండా భక్తులకు తాగునీరు, పండ్లు అందించడం ద్వారా మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు.
ఈ సేవా కార్యక్రమం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ, స్వామి గారి సేవా తత్వాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ తరహా సేవా కార్యక్రమాలు ఇతరులకు కూడా ప్రేరణగా నిలవాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద, శ్రీరామనవమి సందర్భంగా నరసాపురం గ్రామంలోని చిన్న అరుణాచలం ఆలయం వద్ద నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమం భక్తి, సేవ, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.











