ఆదర్శంగా నిలుస్తున్న గొమ్ముగూడెం యువత
గ్రామీణ సమాజంలో మానవత్వం ఇంకా జీవించి ఉందనే విషయాన్ని గొమ్ముగూడెం గ్రామ యువత మరోసారి నిరూపించారు. గ్రామానికి చెందిన కొప్పుల గంగాధర్ (45) అనారోగ్య సమస్యతో మృతి చెందగా, ఆయన కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంది.
ఈ విషయాన్ని గమనించిన గొమ్ముగూడెం యువత ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో స్పందించింది. తక్షణమే స్పందించి దహన సంస్కారాల నిమిత్తం రూ.7,500 ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి తోడుగా నిలిచారు. ఈ సహాయం ద్వారా గ్రామ యువత తమ సేవాభావాన్ని, సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు మాట్లాడుతూ, గొమ్ముగూడెం యువత చూపిస్తున్న సేవా స్పూర్తి అభినందనీయమని,ఇటువంటి సందర్భాల్లో యువత సమన్వయంతో ముందుకు రావడం గ్రామానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసిస్తున్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని యువతకు ఇది మంచి మార్గదర్శకంగా నిలుస్తోందని ఆయన అన్నారు.
గతంలో కూడా “మీకోసం మేమున్నాము” కమిటీ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన సంతపూరి సతీష్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరంలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించారు. ఈ నేపథ్యంలో గొమ్ముగూడెం యువత చేస్తున్న సేవలను మరింత విస్తరించాలని గ్రామ పెద్దలు సూచించారు.











