భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ కొత్తగూడెంలోని విజయ రామ మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయం పూలతో అలంకరించబడగా, భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఆలయ వేద పండితులు మాగి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణ తంతు శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. . వేదఘోషలు, మంగళవాయిద్యాల నాదం, భక్తుల రామ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు కూర్చొని భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ వేడుకలలో భాగంగా సత్యనారాయణపురం సొసైటీ మాజీ అధ్యక్షులు మందపాటి అచ్యుత శ్రీనివాసరాజు దంపతులు ముందుగా స్వామివారికి గణపతి పూజ నిర్వహించి కార్యక్రమానికి శుభారంభం చేశారు. స్వామివారికి రక్షా కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ , కన్యా ధారణ మహా సంకల్పం, మాంగళ్య దారణ జరిగాయి. వారి కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలు అందించారు.
ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించేందుకు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, శ్రీ సీతారాముల ఆశీస్సులు పొందుతున్నారు.











