విద్యుత్ లేక గిరిజన రైతుల ఆవేదన.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , చర్ల మండలం, దానవైపేట గ్రామంలో గిరిజన రైతుల ఆవేదన హృదయ విదారకంగా మారింది. ప్రకృతి కరుణించకపోవడం, ప్రభుత్వ సదుపాయాల లోపం కలిసి రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. గ్రామానికి చెందిన సుమారు 15 మంది గిరిజన రైతులు వాగులోని నీటిని నమ్ముకుని సుమారు 60 ఎకరాల్లో పామాయిల్ పంటను సాగు చేశారు. ప్రారంభంలో పంట చక్కగా పెరిగి మంచి దిగుబడి వస్తుందని ఆశించిన రైతులు, ఇప్పుడు నిరాశలో మునిగిపోయారు.ఇటీవలి కాలంలో ఎండలు మండిపో వడంతో వాగు ముందుగానే ఎండిపోవడం రైతులకు భారీ దెబ్బగా మారింది. నీరు లేకపోవడంతో పామాయిల్ మొక్కలు ఒక్కొక్కటిగా ఎండిపోతూ, రైతుల కళ్లముందే పంట నాశనం అవుతోంది. పంటను కాపాడుకోవాలనే ఆశతో రైతులు అప్పులు చేసి బోర్లు వేయించుకున్నారు. కానీ విద్యుత్ సదుపాయం లేకపోవడంతో ఆ బోర్లు కూడా పనికిరాకుండా పోయాయి. ముఖ్యంగా త్రీ-ఫేజ్ విద్యుత్ లేకపోవడం వల్ల మోటార్లు నడవక, పంటలకు నీరు అందించడం అసాధ్యంగా మారింది.పంటను కాపాడుకోవడానికి అప్పులు చేసి బోర్లు వేసుకున్నాం. కానీ విద్యుత్ లేక వాటిని ఉపయోగిం చుకోలేకపోతున్నాం. మా కష్టాన్ని ఎవరైనా గుర్తించాలి. వెంటనే త్రీ-ఫేజ్ విద్యుత్ అందించి మా పంటలను రక్షించాలి” అంటూ గిరిజన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇప్పటికే లక్షల్లో పెట్టుబడులు పెట్టిన రైతులు పంట నష్టంతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ సదుపాయం కల్పించకపోతే గిరిజన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని త్రీ-ఫేజ్ విద్యుత్ సదుపాయం కల్పించి, పంటలను రక్షించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.











