నేటిసూర్య ప్రతినిధి: అతి పురాతన మహిమాన్వితమైన భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయఅర్చకులు భాను ప్రకాష్ తెలిపారు. పరాభవ నామ సంవత్సర చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి అయిన మార్చి 19, గురువారం ఉగాది సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.
అఖండ దీప స్థాపనతో పాటు అన్ని దేవతామూర్తులకు విశేష రుద్రాభిషేకాలు నిర్వహించబడనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లుచేసినట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా దేవతామూర్తులకు పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేయనున్నారు.
అదే విధంగా విశేష నివేదనలు, నీరాజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రత్యేకతగా సంవత్సరంలో నాలుగు సార్లు మాత్రమే నిర్వహించే రుద్రాభిషేకాలలో ఉగాది ఒకటిగా ఉండడం విశేషం. మహాశివరాత్రి, ఉగాది, వినాయక చవితి, కార్తీక మాస శివరాత్రి రోజుల్లో మాత్రమే ఈ మహా రుద్రాభిషేకం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఉగాది సందర్భంగా గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ జలం, అలాగే గోదావరి నదీ జలాన్ని ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం మూడు రోజుల పాటు స్వామి, అమ్మవారు నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
రాత్రి 7 గంటలకు ఆలయ అర్చకులచే పంచాంగ శ్రవణం కార్యక్రమం జరుగనుండగా, మూడవ రోజు పురాతన మూర్తులకు పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేయనున్నారు.
ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ నిర్వాహకులు యల్లమందల శ్రావణ్ కుమార్, అర్చకులు భాను ప్రకాష్ కోరారు. మరిన్ని వివరాలకు 9908900590 నంబరును సంప్రదించాలని తెలిపారు.











