ఆలయ నిర్మాణానికి గ్రామస్తుల సహకారం ఎంతైనా అవసరం.
నేటి సూర్య ప్రతినిధి : చర్ల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు సప్త ద్వార శ్రీనివాస స్వామి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు ఆలయ నిర్వాహకులు గుంజి పురుషోత్తం, వెంగళ వెంకటరమణ లు తెలిపారు. ఈ ఆలయం నిర్మాణం దాదాపు 150 అడుగుల పొడవు, 35 అడుగుల ఎత్తుతో పూర్తిగా రాతితో నిర్మించబడేలా ప్రణాళిక రూపొందించినట్లు వారు తెలిపారు. ఆలయంలో ప్రతిష్టించనున్న శ్రీనివాస స్వామి విగ్రహం సుమారు 7 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నమూనాను ఆదర్శంగా తీసుకుని, అదే శైలిలో ఈ దేవాలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమం విజయవంతం కావాలంటే గ్రామస్తులు, భక్తులు అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు. ఆలయ నిర్మాణం పూర్తయితే గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రముగా నిలుస్తుందని, భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని తెలిపారు. కావున గ్రామాభివృద్ధి, ధార్మిక పరిరక్షణ దృష్ట్యా సప్త ద్వార శ్రీనివాస ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించి ఈ పుణ్యకార్యాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.











