భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం లక్ష్మీ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని జాంబవంతుడి గుట్టలపై వెలసిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో నేడు (సోమవారం) భక్తి శ్రద్ధల మధ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. మహిమాన్విత శక్తిగా.. భక్తుల కోరికలను తీర్చే అమ్మలగన్న అమ్మగా ప్రసిద్ధి చెందిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ ఏడాది కూడా ఉదయం 10 గంటలకు గిరిజన పూజారులు, గిరిజన ఆచార సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు, డప్పు వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా అమ్మవారి కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు ఇప్పటికే భక్తులతో కళకళలాడుతున్నాయి.
ఈ కళ్యాణ మహోత్సవానికి చర్ల మండలం తో పాటు సమీప ప్రాంతాలైన గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. భక్తులందరికీ అన్నదానం, తీర్థ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ యావత్తు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.










