చర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక సంస్థల విజయ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న పార్టీ శ్రేణుల్లో కొత్త రాజకీయ ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా పొదెం వీరయ్య మాట్లాడుతూ చర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు కేవలం ఎన్నికల గెలుపు మాత్రమే కాకుండా, ప్రజల విశ్వాసానికి నిదర్శనమని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పునాదులు మరింత బలపడుతున్నాయని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం పోరాడే నాయకత్వం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని అన్నారు. కార్యకర్తలే పార్టీకి నిజమైన శక్తి అని పేర్కొంటూ, ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదగాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటున్నదానికి చర్ల మండలం స్పష్టమైన ఉదాహరణగా నిలిచిందన్నారు. పార్టీ లైన్కు కట్టుబడి, క్రమశిక్షణతో పనిచేసిన కార్యకర్తల కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. రానున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు జిల్లా పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సమాయత్తమైందని వెల్లడించారు. ఇదే విజయ పరంపరను కొనసాగిస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రతి గ్రామంలో ఎగరేసే బాధ్యత కార్యకర్తలదే అని నాయకులు స్పష్టం చేశారు. ప్రజల మధ్య ఉంటూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తే విజయం తప్పక వరిస్తుందని స్పష్టం చేశారు. ఈ విజయ యాత్రకు చర్ల మండల ప్రజలు ఘన నీరాజనం పలికారు. ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందన పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపగా, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం నాయకుల్లో కనిపించింది.










