భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబర్ 29న నిర్వహించు తెప్పోత్సవం, 30న నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సంబంధిత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం, కళ్యాణ మండపం, అధ్యయన వేదిక, క్యూ లైన్లు, భక్తుల కోసం సెక్టార్ వైజ్ ఏర్పాట్లు వంటి అంశాలపై దేవస్థానం అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.
మిథిలా స్టేడియం ఉత్తర ద్వారం ప్రాంతంలో క్యూ లైన్ల ఏర్పాటు, భక్తుల ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, భద్రతా బలగాల మోహరింపు, త్రాగునీరు, వైద్య సేవలు, శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలను కలెక్టర్ వ్యక్తిగతంగా పరిశీలించి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చారు. భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులు భద్రాచలానికి చేరుకునే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు పూర్తిస్థాయిలో, నిర్లక్ష్యం లేకుండా చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక రెస్క్యూ టీమ్లను సిద్ధంగా ఉంచాలని, వైద్య విభాగం 24 గంటలు అంబులెన్స్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఉత్తర ద్వారం వద్ద బారికేడింగ్, క్యూ లైన్ కవర్లు, లైటింగ్, సీసీ కెమెరాలు, సమాచార ప్యానెల్స్ ఏర్పాటు వంటి పనుల పురోగతిని ఇంజినీరింగ్ విభాగం అధికారులు కలెక్టర్కు వివరించారు. భద్రతా పరంగా పోలీసు విభాగం, దేవస్థానం విజిలెన్స్, శానిటరీ సిబ్బంది అన్ని విభాగాలు పరస్పర సహకారంతో పని చేయాలని ఆయన సూచించారు.
భక్తులకు సులభ దర్శనం అందించడం ప్రధానం కావడంతో రెస్టింగ్ పాయింట్లు, మెడికల్ క్యాంపులు వంటి ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదని కలెక్టర్ హెచ్చరించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే సమయాల్లో అదనపు వాలంటీర్లు, సిబ్బంది మోహరించాలని సూచించారు.
దేవస్థానం పరిసరాల్లో స్వచ్ఛత, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ ఏర్పాట్లు కూడా కీలకమని పేర్కొంటూ, పంచాయతీ శాఖతో దేవస్థానం అధికారులు సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి విభాగం రోజువారీ పురోగతి నివేదికను సమర్పించి, నిర్ణీత గడువులో అన్ని పనులు పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.
ఎటువంటి విభాగం నిర్లక్ష్యం చూపకూడదని హెచ్చరిస్తూ, భక్తుల సౌకర్యం దృష్టిలో ఉంచుకుని మొత్తం ఏర్పాట్లను అత్యుత్తమంగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో దేవస్థానం ఈవో కె. దామోదర్ రావు, ఇంజినీరింగ్ విభాగం ఈఈ వి. రవీంద్రనాథ్, ఏఈఓలు శ్రవణ్ కుమార్, భవానీ, రామకృష్ణారావు తదితర అధికారులు పాల్గొన్నారు.











