అక్రమ మట్టి రవాణాకు అడ్డాగా చెరువు సింగారం
ప్రజల్లో చైతన్యం రానిదే… పరిస్థితులు మారవు
బూర్గంపాడు, నేటి సూర్య న్యూస్ : ఎవరో వస్తారు… ఏదో చేస్తారు అనుకుంటే పొరపాటే…. మనం సినిమా జీవితంలో బతకడం లేదు… అందులో ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటి పరిష్కారానికి హీరో దిగి వస్తాడు కదా… ఆ సినిమాల కధాంశం… సారాంశం ఒక్కటే ఆ హీరోలు మనమే కావాలని చూపించడం జరుగుతుంది. అయితే మన సమాజంలో ఎలాంటి సమస్యలు వచ్చినా… వాటిని పరిష్కరించుకోక పోగా ఆ సమస్యల వలయంలో చిక్కుకుపోవడం మనకు అలవాటుగా మారిందనడంలో అతిశయోక్తికాదేమో… ఇంతలా వ్యంగ్యంగా వక్రీకరించి రాయడం వెనుక అసలు విషయం ఏముందో వివరాల్లోకి వెళ్లాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం చెరువు సింగారం అక్రమ మట్టి రవాణాకు అడ్డాగా మారిందని అందరికీ తెలిసిందే…. ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్న, రహదారులు ధ్వంసం, బడికి వెళ్లే పిల్లలు, గర్భిణీ స్త్రీలు రహదారిలో ప్రయాణించాలంటే నరకయాతన పడుతున్నారు ఇది అధికారుల అందరికీ తెలుసు కానీ పట్టించుకోని నాధుడే లేకపోవడం ఈ ప్రాంత వాసుల దురదృష్టం. ఈ క్రమంలో శనివారం గ్రామస్తులు అందరూ ఆగ్రహం చెంది అక్రమ రవాణాకు అడ్డుపడటం వారి చైతన్యానికి నాంది అనిచెప్పాలి. ఆ ప్రాంతంలో అక్రమ మట్టి రవాణా చేయరాదని, చేస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఎక్కడ లారీలు అక్కడ నిలుపుదల చేశారు. అధికారులు వచ్చి ఈ అక్రమ రవాణాను ఆపాలని తమ రహదారులు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టుబట్టారు. ప్రభుత్వ మట్టిని అక్రమంగా తరలించకపోతుంటే అధికారులు చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం విమర్శలకు దారితీస్తుంది. కేవలం ముడుపులు తీసుకుంటూ అక్రమ మట్టిని తరలించడంలో తమ పాత్ర కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. అక్రమాన్ని అరికట్టాల్సిన అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో క్రింది స్థాయి సిబ్బంది చేతి వాటంతో అక్రమ మట్టి రవాణా జరుగుతుందని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇకనైనా ఆ ప్రాంత వాసుల ఇబ్బందులు సమస్యలు పరిష్కరించి అక్రమ మట్టి రవాణాను కట్టడి చేయాలని పలువురు ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.











