ప్రజల అభివృద్దే పోలీసుల ప్రధాన లక్ష్యం
చెన్నాపురం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భద్రాచలం ఏఎస్పీ
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చర్ల పోలీసుల ఆధ్వర్యంలో చర్ల మండలంలోని చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామమైన చెన్నాపురంలో మంగళవారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఈ గ్రామంలో ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం గ్రామస్తులందరితో సమావేశమై అక్కడ నివసించే మహిళలకు, చిన్న పిల్లలకు దుస్తులతో పాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ… మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారధ్యంలో ఆదివాసీ ప్రజలకు విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని, అదేవిధంగా నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలోని 90కుటుంబాల్లో నివసించే యువత, పిల్లలు, మహిళలు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చర్ల సీఐ రాజువర్మ, ఎస్సైలు కేశవ, నర్సిరెడ్డి సీఆర్ పీఎఫ్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.