ఐఎన్టీయుసీలో భారీగా చేరికలు
గుర్తింపు సంఘానికి ఎదురుదెబ్బ
బూర్గంపాడు , నేటిసూర్య న్యూస్ : ఒక మంచి వేతన ఒప్పందం జరగాలంటే ఐఎన్టియుసీ పక్షాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, పార్టీ పరంగా మేము ఎప్పుడూ అండగా ఉంటామని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయని ఐఎన్టీయుసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మారం వెంకటేశ్వర రెడ్డి, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గోనె దారుగాలు స్పష్టం చేశారు. మంగళవారం బూర్గంపాడు మండలం సారపాకలోని ప్రముఖ పేపర్ పరిశ్రమ ‘ఐటీసీ పీఎన్ పీడీ’లో తాజాగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్లో భాగంగా ఈ నెల 21న డీసీఎల్ తో అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు సమావేశం కావాల్సి ఉంది. ఆ రోజు ఎన్నికల తేదీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా 13వ వేతన ఒప్పందంలో భాగస్వాములైన ముగ్గురు టీఎన్ టీయుసీ (ఆఫీస్ బేరర్స్) విజయ భాస్కర్ రెడ్డి, రెడ్డం రామకృష్ణారెడ్డి, సుతార్ నరేష్ కుమార్ అనే కార్మికులు టీఎన్ టీయుసీ కార్యవర్గానికి రాజీనామా చేసి తమ సమక్షంలో ఐఎన్టీయుసీలో చేరారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి (మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్) సభ్యులు యారం పిచ్చిరెడ్డి, ఐఎన్టీయుసీ ఐటీసీ సారపాక అధ్యక్షులు గొనె రామారావు, ఐఎన్టీయుసీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.











