చర్ల , నేటిసూర్య న్యూస్ : ఛత్తీస్గఢ్ మరోసారి బాంబుల మోత, తుపాకుల చప్పుళ్లు, నక్సలైట్ల హాహాకారాలతో అడవి అంతా మారుమోగింది. దీంతో మళ్లీ పచ్చని అడవి రక్తసిక్తమైంది. భద్రతా దళాలకు – మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించినట్లుగా తెలిసింది. నారాయణపూర్ జిల్లాలో గురువారం తెల్లవారు జామున భద్రతా సిబ్బంది, మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దక్షిణ అబుజ్ మఢ్ లోని ఒక అడవిలో తెల్లవారు జామున 3గంటలకు భద్రతా సిబ్బంది యాంటీ నక్సలైట్ ఆపరేషన్లో ఉన్నప్పుడు ఈ కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో 12మంది మావోయిస్టులు హతమైనట్లు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. ప్రస్తుతం ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లుగా తెలస్తోంది. నారాయణపూర్, దంతేవాడ, జగ్దల్పూర్, కొండగావ్ జిల్లాల సంయుక్త కార్యాచరణ కొనసాగుతోంది. ఈ ఎన్ కౌంటర్లో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కిందని విశ్వననీయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం నుంచి డీఆర్టీ, ఎన్డీఎఫ్ సీఆర్పీఎఫ్ దళాలు కాల్పుల్లో పాల్గొన్నారు. వాస్తవానికి, అబుజ్ మఢ్ లోని దక్షిణ ప్రాంతంలోని నారాయణపూర్, దంతేవాడ, జగ్దల్పూర్, కొండగావ్ జిల్లాలు సంయుక్త ఆపరేషన్ ను నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఆ ప్రాంతంలో 40 నుంచి 50 మంది పెద్ద క్యాడర్ నక్సలైట్లు ఉన్నట్లు సమాచారం. తదనంతరం దంతెవాడ, నారాయణపూర్, కొండగావ్ బస్తర్ జిల్లాలకు చెందిన సైనికులు ముట్టడిం చారు. ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన నక్సలైట్ల ఉనికి గురించి సైనికులకు సమాచారం అందింది. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ధృవీకరించారు. ఈ క్రమంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య పలుచోట్ల ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్ అనంతరం ఆ ప్రాంతంలో జరిపిన సోదాల్లో 12మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పెద్ద సంఖ్యలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని తెలిసింది.











