స్థానిక సంస్థల ఎన్నికల సమర శంఖారావం పూరించిన బిఆర్ఎస్
చర్ల, నేటిసూర్య న్యూస్:
రాబోయే గ్రామపంచాయతీ, జిల్లా, మండల పరిషత్, సొసైటీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. చర్ల మండల బిఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావు అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో రేగా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభలో రేగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని అన్నారు. ఏడాది కాలంలో ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేక చతికిలపడి ప్రజావిశ్వాసం కోల్పోయిందని హేళన చేశారు. రాష్ట్రంలో ఇపుడు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ పార్టీ వంద సీట్లు గెలుచుకొని అధికారం చేపడుతుందని చెప్పారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకత చవిచూసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని రేగా హేళన చేశారు. ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ నిలబెట్టిన లేదా బలపర్చిన అభ్యర్థులే గెలిచేలా గులాబీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి విజయం సాధించాలని
కోరారు.ఈసమావేశంలో బిఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, గొడవర్తి నర్సింహమూర్తి, చర్ల మండల కోకన్వినర్ ఐనవోలు పవన్ కుమార్, సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్, పోలిన రాముడు, జోగిరాజు, కాకి అనిల్, ఇర్సవడ్ల రాము, చింతా నాగబాబు, ఈర్ని కృష్ణమోహన్, పంజా రాజు తదితరులు పాల్గొన్నారు.











