డీఓటీ అడ్వైజరీ.. టెలికంశాఖ పేరిట ఫేక్ కాల్స్.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు మొబైల్ ఫోన్ల యూజర్లకు ఫోన్ చేసి..చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో మొబైల్ నంబర్ డిస్ కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు.

దీనిపై కేంద్ర టెలికం శాఖ (డీవోటీ) మొబైల్ ఫోన్ యూజర్లకు అడ్వైజరీ జారీ చేస్తూ ఇవన్నీ ఫేక్ కాల్స్ అని స్పష్టం చేసింది. అటువంటి ఫోన్ కాల్స్ రాగానే రిపోర్ట్ చేయాలని సూచించింది. విదేశీ మొబైల్ ఫోన్ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్ చేసి మొబైల్ యూజర్లను తాము ప్రభుత్వాధికారులం అని నమ్మిస్తున్నారని శుక్రవారం జారీ చేసిన అడ్వైజరీలో తెలిపింది.

ఇటువంటి కాల్స్ చేసిన సైబర్ మోసగాళ్లు.. యూజర్ల వ్యక్తిగత సమాచారం తస్కరించి ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతుంటారని టెలికం శాఖ హెచ్చరించింది. టెలికం శాఖ తరఫున ఫోన్ చేయడానికి తాము ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదని స్పష్టం చేసింది. ఇటువంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమాచారం షేర్ చేసుకోవద్దని డీవోటీ వివరించింది.

మొబైల్ ఫోన్ యూజర్లు తమకు వచ్చిన మోసపూరిత ఫోన్ కాల్స్ విషయమై వెంటనే సంచార్ సాథీ పోర్టల్ (www.sancharsathi.gov.in)లో ఫిర్యాదు చేయాలని డీవోటీ పేర్కొంది. ఇదే వెబ్ సైట్ లో ‘ నో యువర్ మొబైల్ కనెక్షన్’ అనే ఆప్షన్ క్లిక్ చేసి యూజర్లు తమ ఫోన్ కనెక్షన్ల వివరాలు తెలుసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఇప్పటికే సైబర్ మోసాల భారీన పడితే 1930 హెల్ప్ లైన్ నంబర్ కి ఫోన్ చేయాలని, www.cybercrime.gov.in వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్